Agnipath Recruitment Scheme Announced By Defense Minister Rajnath Singh
Agnipath Recruitment Scheme : భారతీయ యువత కోసం రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో భారతీయ యువత కోసం కొత్త స్కీమ్ను ప్రకటించింది. అదే ‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్’. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం (14,2022) ప్రకటించారు. అగ్నిపథ్ స్కీమ్ కింద దేశంలోని యువతను దేశ రక్షణ దళంలోకి తీసుకునే అవకాశం దీని ద్వారా కల్పించబడుతుందని తెలిపారు. కొత్త టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సైన్యంలో చేరే యువత ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈ పథకం కింద యువత నాలుగు సంవత్సరాల పాటు దళాలలో చేరి దేశానికి సేవ చేస్తారు.
అగ్నిపథ్ స్కీమ్ కింద సైన్యంలోకి సుమారు 45వేల మందిని రిక్రూట్ చేయనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. అయితే నాలుగేళ్ల పాటు యువత సర్వీసులో ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యులర్ క్యాడర్గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్ల సర్వీస్లో ఉంటారు. మిగతా వాళ్లకు మంచి వేతన ప్యాకేజీ (ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజీ) ఇచ్చి ఇంటికి పంపిస్తారు.
ఉపాధి గురించి మాట్లాడుతూ..మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘అగ్నిపథ్’ పథకం కింద..సాయుధ దళాల యువత ప్రొఫైల్ను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది వారికి కొత్త సాంకేతికతలకు శిక్షణ ఇవ్వడానికి..వారి ఆరోగ్య స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని తెలిపారు.
ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్మీ త్రివిధ దళాల్లో స్వల్పకాలిక నియామకాలు చేయనుంది.అగ్నిపథ్ స్కీమ్ కింద ఎంపికైనవారికి సైనిక బలగాల్లో కొత్త ర్యాంక్ ఇవ్వబడుతుంది. దీంట్లో ఎంపికైనవారు నాలుగేళ్లపాటు దేశ సేవ చేయనున్నారు.అనంతరం వారికి వేతన ప్యాకేజీ ఇచ్చి అగ్నివీర్ సర్టిఫికెట్ ఇవ్వనుంది రక్షణశాఖ. అగ్నివీర్ సర్వీసు తరువాత వారు ఇతర ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. వేతనం నెలకు రూ.30వేల నుంచి రూ,40 వేల వరకు ఉంటుంది. బీవిత బీమా రూ.48 లక్షల వరకు ఉంటుంది.15 ఏళ్ల సర్వీసు తరువాత పెన్షన్ సదుపాయం ఉంటుంది.