భారత్ చేరుకున్న మోడీ రెండో ప్రత్యేక విమానం
- venkaiahnaidu
- Published On : October 25, 2020 / 03:52 PM IST
Second Boeing 777 for PM, President to land today రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన రెండో ప్రత్యేక బోయింగ్ 777 రెండో విమానం భారత్ చేరింది. ఎయిర్ ఇండియా వన్గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. కాగా, తొలి ఎయిరిండియా వన్ విమానం.. ఈ నెల 1న టెక్సాస్ నుంచి ఢిల్లీకి చేరిన విషయం తెలిసింది.
జంబో విమానం బోయింగ్ బి-747ను బి-777గా మార్చి ఎయిరిండియా వన్ విమానాన్ని తయారుచేశారు. ఇందులో అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. గగనతలంలో ఎలాంటి ఆటంకాలు, హ్యాకింగ్ బెడద లేకుండా ఆడియో, వీడియా సమాచార వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు.
అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి ఈ విమానాలని భారత్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విమానంలో అధునాతన భద్రతా పరికరాలను అమర్చారు. వాస్తవానికి,ఈ రెండు విమానాలను ఈ ఏడాది జులైలోనే అందించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడినట్లు అధికారులు చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యతలను వాయుసేనకు అప్పగించారు.
వీవీఐపీల ప్రయాణాల్లో ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా వాయుసేన పైలట్లు నడుపుతారని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు.. ఎయిర్ ఇండియాకు చెందిన బీ747 విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వీటిని ఎయిర్ ఇండియా పైలట్లు ఆపరేట్ చేస్తున్నారు. బీ777 విమానాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో బీ747లను ఎయిర్ ఇండియాలో కమర్షియల్ ఆపరేషన్స్ కోసం వినియోగించనున్నారు.
