Air India sale.. ‘డబ్బుల్లేక బీజేపీ ఆస్తులన్నీ అమ్మేస్తుంది’
- Subhan Ali Shaik
- Published On : January 27, 2020 / 06:59 AM IST
ఎయిరిండియా ప్రైవేటీకరణ చేస్తామని అందులో వాటాలు అమ్ముతామని చెప్పిన కేంద్రం మొత్తంగా అమ్మేయాలని డిసైడ్ అయింది. ఈ మేర 100శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తుంది. దీనిపై విమర్శలకు సొంత పార్టీ ఎంపీయే దిగాడు. ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి కోర్టుకు ఎక్కుతానని అమ్మడానికి కుదరదంటూ అడ్డం తిరిగాడు.
ఆయన చేసిన ట్వీట్లో ఇది జాతికి వ్యతిరేకం.. దీనిపై కోర్టుకు వెళతానని అన్నారు. ‘ఎయిరిండియా పెట్టుబడి ఉపసంహరణ నేటితో మళ్లీ మొదలుకానుంది. ఇది పూర్తిగా జాతికి వ్యతిరేకం. కోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నా. కుటుంబం లాంటి మన దేశ సంపదను అమ్మడానికి ఒప్పుకోను’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబాల్ కూడా ప్రభుత్వం పద్ధతిని మీడియా సమావేశంలో ఎండగట్టాడు. ‘ప్రభుత్వాలు డబ్బులు లేకపోతేనే ఇలాంటివన్నీ చేస్తాయి. భారత ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్. ఆర్థికాభివృద్ధి 5శాతం కంటే తక్కువగానే ఉంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్కు ఇంకా మిలియన్ రూపాయలు ఇవ్వాల్సి ఉంది. వాళ్లు ఇదే చేయగలరు. మనకున్న విలువైన ఆస్తులన్నీ అమ్మేసుకోవడమే’
సోమవారం ప్రభుత్వం ఎయిరిండియాలో 100శాతం ఆస్తులు అమ్ముతున్నట్లు ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని బిడ్ కు ఆహ్వానించింది. మార్చి 17వరకూ ఎవరు ఎక్కువ వేస్తే వారికే ఇస్తామని ప్రకటించింది. ఎయిరిండియా ఆస్తులతో పాటు అందులోని మేనేజ్మెంట్ను కూడా కొత్త యజమానికి అప్పజెప్పనున్నట్లు తెలిపారు.
