Nagaland Rally : అమిత్ షాకు వ్యతిరేకంగా..నాగాలాండ్ లో భారీ నిరసన ర్యాలీ
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా నాగాలాండ్ లోని మోన్ లో ఇవాళ భారీ నిరసన ప్రదర్శన జరిగింది. గత వారం మోన్ లో ఆర్మీ కాల్పుల్లో 14 మంది అమాయకపు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై
- venkaiahnaidu
- Published On : December 11, 2021 / 07:26 PM IST
Nagaland
Nagaland Rally : కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా నాగాలాండ్ లోని మోన్ లో ఇవాళ భారీ నిరసన ప్రదర్శన జరిగింది. గత వారం మోన్ లో ఆర్మీ కాల్పుల్లో 14 మంది అమాయకపు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అసత్య మరియు కల్పిత ప్రకటన చేశారని,అందుకు ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని (AFSPA) చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
గత శనివారం ఎన్కౌంటర్ మోన్ లో ఆర్మీ ఎన్ కౌంటర్ లో చనిపోయిన 14 మందిలో 12 మంది ఓటింగ్ గ్రామానికి చెందిన వారు. వీరంతా కొన్యాక్ అనే గిరిజన తెగకు చెందినవారు. దీంతో ఓటింగ్ గ్రామంలో కోన్యాక్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం భారీ నిరసన చేపట్టారు. అమిత్ షా దిష్టి బొమ్మను తగలబెట్టారు. తమకు సానుభూతి వద్దని, న్యాయం కావాలని కొన్యాక్ యూనియన్ ఉపాధ్యక్షుడు హొనంగ్ కొన్యాక్ తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అమిత్షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. అమిత్ షా మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని, అలాగే ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని కూడా రద్దు చేయాలని హొనంగ్ కొన్యాక్ డిమాండ్ చేశారు. 14 మంది మృతులకు న్యాయం జరిగే వారకు తమ పోరాటం ఆపబోమని హొనంగ్ కొన్యాక్ సృష్టం చేశారు.
కాగా, నాగాలాండ్ ఘటన అనంతరం పార్లమెంట్లో అమిత్షా మాట్లాడుతూ సైనికులు సిగ్నల్ ఇచ్చినప్పటికీ వాహనం ఆపకుండా ముందుకు కదలడంతో ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే తమకు అలాంటి సిగ్నల్ ఏం రాలేదని, తమ వాహనంపై ఉద్దేశపూర్వకంగానే సైనికులు కాల్పులు జరిపినట్లు జవాన్ల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి తెలిపారు.
ఇక,మోన్ ఘటనపై విచారణకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని,14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరినీ లా ఆఫ్ ది లాండ్ ప్రకారం శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం AFSPA ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం హంతకులను కాపాడుతోందని విమర్శించారు. నాగాలాండ్ సీఎం ,మేఘాలయ సీఎంలు కూడా AFSPA ని రద్దు చేయాలని ఇదివరకే డిమాండ్ చేశారు.
ALSO READ Nagaland Encounter : పౌరులపై ఆర్మీ కాల్పులకు కారణాలేంటో చెప్పిన అమిత్ షా
