Annamalai : బీజేపీకి అన్నామలై రాజీనామా.. నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ అందజేత..?

Annamalai : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు.

Annamalai resigns from BJP

Annamalai : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ అన్నామలై తిరస్కరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే, అన్నామలై రాజీనామా విషయంపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Also Read : Trump – Netanyahu : ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే..

అన్నామలై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరారు. వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏడాది తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. సాంప్రదాయకంగా ద్రావిడ ప్రధాన పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో అన్నామలై బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచారు. ఉధృతమైన ప్రచారాలు, విస్తృతమైన క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకోవడం ద్వారా, ఆయన పార్టీ సంస్థాగత విస్తరణకు సాయ పడటంతో పాటు, గణనీయమైన వ్యక్తిగత అనుచర వర్గాన్ని కూడా నిర్మించుకున్నారు.

అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు బీజేపీలో అధ్యక్ష మార్పు జరగాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పట్టుబట్టడంతో అన్నామలై స్థానంలో నూతన అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం నియామకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై బరిలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే బీజేపీ ప్రచారంలో కూడా అన్నామలై ప్రముఖ పాత్ర పోషించలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర ఓటమి తరువాత అన్నామలై బీజేపీ వీడి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజాగా.. అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారని, రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి అందజేసినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అన్నామలై భేటీ అవుతారని తెలిసింది. ఆ భేటీ తరువాత అన్నామలై నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అన్నామలై మొదట ఒక ఉద్యమాన్ని, ఆ తర్వాత పార్టీని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను చేర్చుకోవడం, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడం అన్నామలై లక్ష్యం అని చెబుతున్నారు. ఈ కొత్త ఉద్యమం పెద్ద ఎత్తున పని చేస్తుందని, విభిన్న వృత్తిపరమైన సామాజిక నేపథ్యాల నుండి స్వచ్ఛంద కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.