Arvind Kejriwal: దేశ వ్యాప్తంగా ఈ ఆర్డినెన్సు తీసుకువస్తున్నారు.. నాకు సమాచారం అందింది: కేజ్రీవాల్ వార్నింగ్
ప్రజలు తమ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసినా కేంద్ర సర్కారే ఢిల్లీలో పాలన కొనసాగిస్తుందని తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : June 11, 2023 / 04:31 PM IST
Arvind Kejriwal
Arvind Kejriwal – AAP: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై ఢిల్లీ (Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సు (Centres Ordinance) కి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఇవాళ రామ్ లీలా మైదానంలో మహా ర్యాలీ చేపట్టారు. పార్లమెంటులో కేంద్ర ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని ఇప్పటికే దేశంలోని విపక్షాలను కేజ్రీవాల్ కోరిన విషయం తెలిసిందే.
ఇవాళ మహా ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ… ఢిల్లీలో పాలన అధికారాలపై కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తీసుకోనుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తనకు సమాచారం అందిందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక ఆర్డినెన్సుతో ఢిల్లీపై తొలి దాడి చేశారని, ఇటువంటి ఆర్డినెన్సులే ఇతర రాష్ట్రాల్లోనూ తీసుకురానున్నారని తెలిపారు.
కేంద్రం అటువంటి ఆర్డినెన్సును తీసుకొచ్చి ఢిల్లీ ప్రజలను అవమానించిందని చెప్పారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉండబోదని ఆ ఆర్డినెన్సు స్పష్టం చేస్తోందని అన్నారు. ఢిల్లీలో రాచరికం ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నరే సర్వాధికారిగా ఉంటారని చెప్పారు.
ప్రజలు తమ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసినా కేంద్ర సర్కారే ఢిల్లీలో పాలన కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్ర సర్కారు తీరుకి వ్యతిరేకంగా తాను దేశ వ్యాప్తంగా మద్దతు కోరుతున్నానని, ఢిల్లీ ప్రజలు ఒంటరి వారు కాదని అన్నారు. 140 కోట్ల మంది దేశ ప్రజలు ఢిల్లీ ప్రజలకు మద్దతుగా ఉన్నారని చెప్పారు.
Karnataka Politics: ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే మరో సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం
