Ban On Smartphones: ఇది ఆధునిక ప్రపంచం. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ పైనే నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరూ ఉండలేకపోతున్నారు. అన్ని పనులు ఇప్పుడు ఫోన్ పైనే జరిగిపోతున్నాయ్. అందుకే.. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. 4జీ, 5జీ అయిపోయాయ్.. ఇప్పుడు ప్రపంచం ఏకంగా 6జీ వైపు పరుగుపెడుతోంది. ప్రపంచం పరిస్థితి ఇలా ఉంటే.. ఆ ఊరిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. అక్కడ మహిళలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. ఆ ఊరిలోని మహిళలు ఎవరూ కూడా స్మార్ట్ ఫోన్ వాడటానికి వీల్లేదు. ఈ మేరకు కమ్యూనిటీ పెద్దలు హుకుం జారీ చేశారు.
రాజస్థాన్ రాష్ట్రం జలోర్ జిల్లాలో మహిళలు స్మార్ట్ ఫోన్ వాడకుండా బ్యాన్ చేశారు. వారు కేవలం కీ ప్యాడ్ ఫోన్లు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ప్రపంచమంతా 6జీ వైపు పరుగులు పెడుతుండగా రాజస్థాన్లోని జలోర్ జిల్లాలోని 15 గ్రామాలలో మహిళలను కీప్యాడ్ ఫోన్ల యుగానికి తిరిగి వెళ్లమని కోరుతున్నారు. చౌదరి వర్గానికి చెందిన సుంధమాతా పట్టి పంచాయతీ కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళలు, బాలికలు స్మార్ట్ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. మొబైల్ వ్యసనం, పిల్లల కంటిచూపుపై స్క్రీన్ల ప్రభావంపై ఆందోళనలను పేర్కొంటూ కమ్యూనిటీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిబంధన జనవరి 26 నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ప్రకారం, మహిళలు కేవలం కీప్యాడ్ ఫోన్లలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. పెళ్లిళ్లకు, సామాజిక సమావేశాలకు లేదా పొరుగు వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడానికి ఇకపై అనుమతి ఉండదు.
స్థానిక కమ్యూనిటీ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. స్మార్ట్ ఫోన్లు వాడకుండా నిషేధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదంటున్నారు. మహిళలు, బాలికలపై వివక్ష చూపటం ఏంటని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయిందని, వ్యసనంగా మారిందని, దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని, కంటి చూపు సమస్యలు వస్తున్నాయని, ఇది చక్కని నిర్ణయం అని సమర్థించే వాళ్లూ ఉన్నారు.
Also Read: అద్భుతమైన డీల్ భయ్యా.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..