Bharat Bandh: అగ్నిపథ్కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్?
కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పనిచేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దీనిని నిరసిస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : June 17, 2022 / 07:18 PM IST
Barath Bandh
Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పనిచేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దీనిని నిరసిస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మరోవైపు మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్ఫోర్స్లో నియామకాల ప్రక్రియ షురూ..
తెలంగాణలో ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి చొచ్చుకెళ్లి రైళ్లకు నిప్పుపెట్టారు. అడ్డుకొనేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా, పదిహేను మందికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే బీహార్లో ఆందోళన చేస్తున్న యువకులు రేపు ఆ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ఆర్జేడీ కూడా మద్దతు ప్రకటించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. హర్యానా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.
Minister Kishan Reddy: ’అగ్నిపథ్‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..
దాదాపు అన్ని రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్నవారు రేపు (జూన్18)న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు బీజేపీయేతర పార్టీలు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఆర్మీని కూడా ప్రైవేట్ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అగ్నిపథ్ పథకాన్ని యువత తిరస్కరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దాదాపు ఎన్డీయేతర పార్టీలన్నీ రేపు జరిగే బంద్ కు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
