Court Verdict Delivered After 108 Years In A Civil Case
Court verdict delivered after 108 years in a civil case : కోర్టుల్లో సివిల్ మ్యాటర్ల కేసులు దశాబ్దాల తరబడి కొనసాగుతుంటాయని తెలిసిందే. కానీ మరో శతాబ్దం అంటే 100 ఏళ్ల దాటి మరీ కొనసాగుతాయా? అంటే నిజమే అని అనాల్సిందే. ఎందుకంటే ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు తీర్పును కోర్టు 108 ఏళ్లకు తీర్పునిచ్చింది…! ఇది బహుశా దేశంలో పెండింగ్లో ఉన్న అత్యంత పురాతన కేసులలో ఒకటి అని చెప్పవచ్చు. 108 ఏళ్లకు ఎట్టకేలకు కోర్టు మార్చి 11న భోజ్ పూర్ అదనపు జిల్లా జడ్జి శ్వేతా సింగ్ తీర్పును వెలువరించారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని భోజ్ పుర్ జిల్లా ఆరా సివిల్ కోర్టులో 1914లో మూడు ఎకరాలకు సంబంధించి భూ వివాదానికి సంబంధించి దావా దాఖలయింది. కోయల్వార్ గ్రామంలో మూడు ఎకరాల భూమికి సంబంధించిన దావా ఇది. యాజమాన్య హక్కుల కోసం రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఈ దావా వేశారు.
బీహార్ రాజధాని పాట్నాకు 40 కిలోమీటర్ల దూరంలో ఈ వివాదాస్పద స్థలం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి 5 కోట్లు పలుకుతోంది. అప్పట్లో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న సమయంలో కొయిల్వార్ లో అజ్ హర్ ఖాన్ అనే వ్యక్తికి 9 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో అతని వారసుల నుంచి కొనుగోలు చేసిన మూడు ఎకరాల స్థలం విషయమై రెండు రాజ్ పుత్ కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఒక వర్గం కోర్టులో దావా వేసింది. రాజీ కుదుర్చుకునేందుకు రెండు పార్టీలు అంగీకరించలేదు. దీంతో, కేసు విచారణ శతాబ్ద కాలానికి పైగా కొనసాగింది. ఎట్టకేలకు మార్చి 11న భోజ్ పుర్ అదనపు జిల్లా జడ్జి శ్వేతాసింగ్ తీర్పును వెలువరించారు. కేసు వేసిన దర్బారీసింగ్ ముని మనవడు అతుల్ సింగ్ తదితరులకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు.
ఈ కేసుకు సంబంధించి తీర్పునిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి శ్వేతాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1914 నుంచి సుదీర్ఘ కాలం పాటు ఈ కేసు విచారణ కొనసాగిందని… ఇదే సమయంలో రెండు కుటుంబాలు కొన్ని తరాల వారసులను కోల్పోయాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినా.. ఈ వివాదం ఇంతటితో ఆగుతుందని చెప్పలేమని అన్నారు. కేసు ఓడిపోయిన వారు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.