Aadhaar cards: ఏకంగా ప్రధాని మోదీ, సీఎం యోగి ఆధార్ కార్డులనే ట్యాంపర్ చేయబోయిన విద్యార్థి.. ఏదన్నా కుట్ర?
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లా సదత్పూర్ ప్రాంతానికి చెందిన అర్పనా దుబే అలియాస్ మదన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : July 26, 2023 / 06:01 PM IST
PM Modi, CM Yogi
Aadhaar cards – Bihar: బిహార్కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్(Yogi Adityanath) ఆధార్కార్డులను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన గుజరాత్ పోలీసులు బుధవారం నిందితుడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లా సదత్పూర్ ప్రాంతానికి చెందిన అర్పనా దుబే అలియాస్ మదన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడి సొంత గ్రామం గరీబా గావ్ అని, కాంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజీలో గ్రాడ్యేయేషన్ చదువుతున్నాడని వివరించారు.
మోదీ, యోగి ఆధార్కార్డుల్లో మార్పులు చేసేందుకు మదన్ కుమార్ ఓ కంప్యూటర్ నుంచి ప్రయత్నాలు చేశాడని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని గుర్తించి, ఐపీ అడ్రస్ ఆధారంగా అతడిని వెతుకుతూ గుజరాత్ పోలీసులు సదత్పూర్ ప్రాంతానికి వెళ్లారు. స్థానిక పోలీసుల సాయంతో అతడిని పట్టుకున్నారు.
ఆధార్కార్డులను ట్యాంపరింగ్ చేస్తున్న నేరం కింద అతడిని అరెస్టు చేశారు. మోదీ, యోగి జన్మదిన తేదీలను, ఇతర వివరాలను నిందితుడు మార్పేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థి ఇటువంటి చర్యలకు పాల్పడడం వెనుక ఏదన్నా కుట్ర ఉందా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
