దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ

bird-flu

Bird flu diagnosis in 7 states across the country : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న బర్డ్ ఫ్లూ మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడింది. ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పెద్ద భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు కూడా ఈ వైరస్ కు గురై మృత్యువాతపడుతున్నాయి. బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ చేసినట్లు తెలిపింది.

బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పక్షులు అనుమానాస్పద స్థితిలో చనిపోతే సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే ఆ వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచించింది. అంతేకాదు ఈ సీజన్‌లో మన దేశానికి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వలస పక్షులు వస్తాయని.. ఈ నేపథ్యంలో వాటిపై గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణకు ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. చనిపోయిన పక్షులను ప్రొటోకాల్ ప్రకారం పూడ్చిపెట్టాలని ఆదేశించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించింది.

మరోవైపు దేశంలో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం విధించింది. ఇటీవ‌ల అక్క‌డ వ‌రుస‌గా ప‌క్షులు మృత్యువాత ప‌డుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ వెల్ల‌డించారు. అలాగే ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మ‌రో 10 రోజుల‌పాటు మూసే ఉంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. చ‌నిపోయిన కోళ్ల నుంచి కొన్ని శాంపిల్స్ తీసి జ‌లంధర్‌లోని ల్యాబ్‌కు పంపించామ‌ని, సోమ‌వారం రిపోర్టులు వ‌స్తాయ‌ని కేజ్రివాల్ చెప్పారు. ఆ రిపోర్టుల ఆధారంగా ఢిల్లీలో అవసరమైన చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.

ఇప్పటికే కేర‌ళ స‌హా ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమ‌తుల‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ‌బర్డ్ ఫ్లూ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప‌దిరోజుల‌పాటు ఈ నిషేధం కొన‌సాగుతుంద‌ని తెలిపింది. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని స‌రిహ‌ద్దు జిల్లాల‌కు చికెన్ స‌ర‌ఫ‌రా జ‌రుగ‌కుండా ఆదేశాలు జారీ చేసిన‌ట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.