డీడీసీ ఎన్నికల ఫలితాలు : జమ్మూలో బీజేపీ హవా.. కశ్మీర్ లో ఖాతా తెరిచిన కమలం

BJP Leads in Jammu నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లోజమ్ముకశ్మీర్​ లో జరిగిన జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు ఈ నెల 19తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో 280 డీడీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2,178 మంది అభ్యర్తులు డీడీసీ ఎన్నికల్లో పోటీ చేశారు.

జమ్ము కశ్మీర్​లో డీడీసీల ఏర్పాటు ఇదే మొదటిసారి. ఆర్టికల్​ 370, 35ఏ రద్దు తర్వాత.. తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. నేషనల్​ కాన్ఫరెన్స్​, పీడీపీ, పీపుల్స్ మూవ్​మెంట్​, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ సహా మరో నాలుగు పార్టీలు కలిసి.. ‘పీపుల్స్ అలయన్స్​ ఫర్​ గుప్కార్​ డిక్లరేషన్’​ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

అయితే,ఇవాళ(డిసెంబర్-22,2020) ఉదయం డీడీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో తొలిసారి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన డీడీసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. అంచనాలకు మించి జమ్ములో బీజేపీ సత్తా చాటుతోంది. గుప్కార్​ కూటమికి గట్టి పోటీ ఇస్తూ కమలనాథులు దూసుకెళ్తున్నారు. జమ్మూ ప్రాంతంలో 44 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా,,కేవలం 20 స్థానాల్లో మాత్రమే గుప్కర్ కూటమి ఆధిక్యంలో ఉంది.

కశ్మీర్​లో మాత్రం గుప్కార్ కూటమి హవా నడుస్తోంది. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.కశ్మీర్ ప్రాంతంలో గుప్కర్ కూటమి 61 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా..బీజేపీ 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అయితే ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం గమనార్హం. బల్హామాలో బీజేపీ అభ్యర్థి అయిజాబ్ హుస్సేన్ విజయం సాధించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఆర్టికల్​ 370 రద్దు చేసినప్పటికీ ఇక్కడ బీజేపీ పలు స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. కశ్మీర్​ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనడానికి ఇది నిదర్శనమని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తెలిపారు.

అయితే, ఇటీవల జరుగుతోన్న పలు ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్​.. డీడీసీ ఎన్నికల్లో పుంజుకుంది. పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చేలా జమ్ము, కశ్మీర్​ ప్రాంతాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే గుప్కార్​ కూటమి అధిక్యంలో ఉండగా… బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది.