Ramdas Athawale : మహారాష్ట్రలో ఎన్సీపీ-బీజేపీ ప్రభుత్వం!
కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- venkaiahnaidu
- Published On : July 18, 2021 / 02:30 PM IST
Ramdas
Ramdas Athawale కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రామ్దాస్ అథవాలే వ్యాఖ్యానించారు. శనివారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP)చీఫ్ శరద్ పవార్.. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయిన నేపథ్యంలో రామ్దాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి బయటికి వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు కలపాలని రామ్దాస్ అథవాలే కోరారు.
అయితే,ప్రధాని మోదీ-శరద్పవార్ భేటీ నేపథ్యంలో బీజేపీ-ఎన్సీపీ పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో… బీజేపీ, ఎన్సీపీ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన, రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయని, అలాంటి రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ శనివారం చేసిన వ్యాఖ్యలపై కూడా రామ్ అథవాలే స్పందించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా రాజకీయపరమైన, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని, అయినా ఆ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు. అటువంటప్పుడు ఎన్సీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేవని అథవాలే ప్రశ్నించారు. శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని తాను కోరుతున్నానని..శివసేనకు ఇస్తున్న మద్దతును ఎన్సీపీ ఉపసంహరించుకోవాలని అథవాలే తెలిపారు. మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే తరచూ శరద్ పవార్ కి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని..అందుకే తాను శరద్ పవార్ ఎన్డీయేలోకి రావాలని తాను కోరుకుంటున్నానని రామ్ దాస్ అథవాలే తెలిపారు. కేవలం ఎన్సీపీ, శరద్ పవార్ కారణంగానే శివసేనకు కాంగ్రెస్ మద్దతిస్తోందన్నారు.
ఇక,రైతుల సమస్యలపై చర్చించేందుకు మాత్రమే శరద్ పవార్..ప్రధానిన కలిశారని శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా రామ్ దాస్ అథవాలే స్పందించారు. రైతుల ఇష్యూ గురించి వారి మాట్లాడినా కూడా అది మంచిదేనని..నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన ముగుస్తుందని..రైతులకు న్యాయం జరుగుతుందని రామ్ దాస్ అథవాలే తెలిపారు.
