నిన్న బీహార్,నేడు యూపీలో…గంగానదిలో తేలాడుతున్న కోవిడ్ మృతదేహాలు
నిన్న బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ 100 కరోనా మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో
- venkaiahnaidu
- Published On : May 11, 2021 / 08:08 PM IST
Bodies Found
Bodies Found నిన్న బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ 100 కరోనా మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఘాజీపూర్ జిల్లాలో.. గంగానదిలో తేలియాడుతున్న వందలాది మృత దేహాలను చూసి స్థానికులు హడలిపోయారు. తీవ్ర దుర్వాసన రావడంతో అవి కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు.
ఇవన్నీ కోవిడ్ మృతదేహాలై ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో డెడ్ బాడీల దహనం లేదా ఖననానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ లేనందున వీటిని వీరి బంధువులు నదిలో విసరివేసి ఉంటారని ఘాజీపూర్ వాసులు చెబుతున్నారు. ఈ మృత దేహాల వల్ల నదినీరు చాలా కలుషితమై పోయిందని, దీంతో కోవిడ్ వైరస్ మరింత వ్యాప్తి చెంది తమకు పెను ముప్పు ఏర్పడుతుందని వీరు భయపడుతున్నారు.
ఈ మృత దేహాలు ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చాయన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వీటిని దహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదని అధికారులు పేర్కొన్నారు. వందల సంఖ్యలో ఉన్న వీటిని అసలు నది నుంచి బయటకు వెలికి తీయడమే కష్టమని, పైగా కోవిడ్ రోగులవైనందున ఒక్కరు కూడా సాహసించడం లేదని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
