‘బోరో మా’కన్నుమూత:అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

  • Publish Date - March 6, 2019 / 06:29 AM IST

పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో మతువా వర్గం ప్రజలు నడిచే దేవతగా భావించే బినాపాణి దేవి (బోరో మా) మార్చి 5 రాత్రి 8.52 గంటల సమయంలో వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు.  పలు అవయవాలు పని చేయక  తన 100 సంవత్సరాల వయస్సులో బీనాపాణి దేవి మరణించినట్టు కోల్ కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 

“గత నెలలో నేను బోరో మాను దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందాను. ఆమెతో మాట్లాడిన ప్రతిసారీ నేనెంతో ప్రేరణ పొందాను. ఈ విషాద సమయంలో మతువా వర్గ ప్రజలకు నా సంతాపం” అని మోదీ ట్వీట్ చేశారు. బోరో మా అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిపిస్తామని, 21 గన్స్ తో గౌరవవందనం సమర్పించనున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ఆమె మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని ఆమె అన్నారు. కాగా, 2011, 2016లో మమతా బెనర్జీ సర్కారు అధికారంలోకి రావడానికి పశ్చిమ బెంగాల్ లోని మతువా వర్గం ఓట్లు అత్యంత కీలకం అయ్యాయి. వారంతా ఒకే మాటపై నిలిచి మమతకు మద్దతిచ్చారు.