ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది.. హనీమూన్ పేరుతో హోటల్కు తీసుకెళ్లి చంపేసింది.. ఆ తరువాత..
బజల్ పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ (45) వ్యవసాయం చేస్తూ పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తున్నాడు.
- Harishth Thanniru
- Published On : June 30, 2025 / 01:05 PM IST
Brutal incident in Uttar Pradesh
Uttar Pradesh: ఇండోర్కు చెందిన కొత్త జంట పెళ్లి తరువాత మేఘాలయకు హనీమూన్కు వెళ్లింది. అక్కడ భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్యచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరవక ముందే గద్వాల్ జిల్లాలో పెళ్లిచేసుకున్న కొద్దిరోజులకే భర్తను ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి భార్య హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా వరుస ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, మేఘాలయ, గద్వాల్ ఘటన తరహాలో లక్నోలో మరో ఘటన చోటు చేసుకుంది.
బజల్ పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ (45) వ్యవసాయం చేస్తూ పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తున్నాడు. అతనికి వెనకాముందు ఎవరూ లేరు. 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయినా పెళ్లికాకపోవటంతో తివారీ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ఇంద్రకుమార్.. అక్కడ ప్రసంగించిన గురువుతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. తనకు ఎవరూలేరని, ఇంకా పెళ్లికాలేదని వాపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ఉత్తరప్రదేశ్ లోని ఓ ముఠా.. ఇంద్రకుమార్ ను ట్రాప్ చేసి అతని ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ వేసింది.
ముఠా ప్లాన్లో భాగంగా యూపీలోని గోరఖ్పూర్కు చెందిన సాహిబా బానో అనే మహిళ ఖుషితివారీ పేరుతో సోషల్ మీడియాలో ఇంద్రకుమార్ తివారీతో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం కాస్త పెళ్లివరకు దారితీసింది. వివాహం మాత్రం కుషినగర్ లోనే జరగాలని ఖుషితివారీ కండీషన్ పెట్టింది. దీనికి ఇంద్రకుమార్ ఒప్పుకోవటంతో.. కుషినగర్ లోని ఓ ఆలయంలో వారి పెళ్లి జరిగింది.
పెళ్లి జరిగిన ఆనందంలో ఉన్న ఇంద్రకుమార్ను సాహిబా బానో తన అనుచరులతో కలిసి హత్య చేసింది. పెళ్లి చేసుకున్న తరువాత హనీమూన్ కోసం ఇంద్రకుమార్ తివారీని ఒక హోటల్ గదికి తీసుకెళ్లింది. అక్కడ అతనికి మత్తు మందు ఇచ్చి తన అనుచరులతో కలిసి చంపేసింది. అతడి వద్ద ఉన్న డబ్బు, నగలు తీసుకొని తన ముఠాతో కలిసి పారిపోయింది.
జూన్ 6వ తేదీన కుషినగర్లోని జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో ఇంద్రకుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాహిబా బానోతోసహా మరో ఇద్దరిని అరెస్టు చేసి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
