Hot Water Corona : ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. కోవిడ్ సృష్టిస్తున్న విలయాన్ని కళ్లారా చూసి భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా చికిత్సకు సంబంధించిన సమాచారం కోసం తెగ శోధిస్తున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ పరిస్థితుల్లో కరోనా చికిత్సకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వేడి నీళ్లు కరోనాను చంపడం లేదా తగ్గించడమనేది నిజం కాదని వెల్లడించింది. ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల దగ్గర మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని తెలిపింది.
వేడినీళ్లు తాగడం, వాటితో స్నానం చేయడం వల్ల కరోనా అంతం అవ్వడం మాట అటుంచితే.. శరీరానికి ఎంతోకొంత ఉపశమనం లభిస్తుందనేది వాస్తవం. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లునొప్పులు తగ్గుతాయి. మొదడు ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా సరిగా అందుతుంది. అలాగే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్లలో ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీటితో పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ సూచించింది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
అయితే, వేడి నీటి స్నానం, వేడినీరు తాగడం వల్ల కరోనా రాదన్నది నిజం కాదని తేల్చి చెప్పింది. అలాగే మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, అత్యవసరం అయితేనే బయటికి వెళ్లడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. వాటి వల్లే కరోనా రాకుండా చూసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
We are here to bust all #myths. Don’t believe everything you read. Hot water bath or drinking warm water does not prevent #COVID-19.#IndiaFightsCorona #Unite2FightCorona @MIB_India @MoHFW_INDIA @PIB_India @drharshvardhan pic.twitter.com/iBPKS87XKV
— MyGovIndia (@mygovindia) May 8, 2021