ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కు మరో 24గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసర్ ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఓఎస్డీగా ఉన్న గోపాల్ క్రిష్ణ మాధవ్…జీఎస్టీకి సంబంధించిన విషయంలో 2లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని,దీంతో అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
అరెస్ట్ చేసిన వెంటనే మాధవ్ ను సీబీఐ ప్రధానకార్యాలయానికి తరలించారు. సిసోడియా ఆఫీస్ లో 2015నుంచి ఓఎస్డీగా మాధవ్ పనిచేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఏదీ బయటపడలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాన పార్టీలుగా ఆమ్ ఆద్మీ,బీజేపీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మరోసారి మరోసారి నిలబెట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ,ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ,గత వైభవాన్ని మళ్లీ కొనసాగించాలని కాంగ్రెస్ లు ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో వ్యూహాలు రచించారు. ఇక మిగిలింది ప్రజలు ఓట్లు వేయడమే.