Pm Kisan
PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతుల కోసం కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయంగా కొంత మొత్తాన్ని ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది రూ.6వేలు.. మూడు విడతల్లో( రూ.2వేల చొప్పున) కేంద్రం అందజేస్తుంది. కాగా, 8వ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. దీనికి సంబంధించి వార్తలూ వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలోనూ పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. 8వ విడత డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దానిపైనా స్పష్టత రాలేదు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. అసలు డబ్బు వేస్తారో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కొన్నిరోజులుగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది. దీంతో పీఎం కిసాన్ 8వ విడతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. తాజాగా కేంద్రం ఈ విషయంపై స్పందించింది. ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను అర్హులైన రైతుల అకౌంట్ లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 8వ విడత డబ్బులు వస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి జమ చేయలేదని కైలాష్ చౌదరి తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించే పథకాన్ని 2019లో ప్రారంభించింది కేంద్రం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున అందజేస్తుంది.