Ethanol Petrol : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్లో ఇక E30 పెట్రోల్కు మార్గం సుగమం..
Ethanol Petrol : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడిచమురు దిగుమతుల భారం తగ్గించి, పర్యావరణాన్ని కాపాడేలా పెట్రోల్లో ఇథనాల్ కలపడంలో కేంద్రం మరో భారీ అడుగు వేసింది. E30 పెట్రోల్ ప్రమాణాలను ప్రభుత్వం నోటిఫై చేసింది.
- Harish Thanniru
- Published on- May 19, 2026 / 11:38 PM IST
Ethanol Petrol
Ethanol Petrol : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడిచమురు దిగుమతుల భారం తగ్గించి, పర్యావరణాన్ని కాపాడేలా పెట్రోల్లో ఇథనాల్ కలపడంలో కేంద్రం మరో భారీ అడుగు వేసింది. E30 పెట్రోల్ ప్రమాణాలను ప్రభుత్వం నోటిఫై చేయడంతో దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరా ధరలపై ఆందోళనలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. అలా చేస్తే లక్ష బహుమతి.. అదిరిపోయే ఆఫర్
దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత E20 ఇంధనంతో పోలిస్తే E30 పెట్రోల్లో 30శాతం ఇథనాల్ను పెట్రోల్తో కలుపుతారు. రాబోయే సంవత్సరాల్లో ఇథనాల్ మిశ్రమాన్ని క్రమంగా పెంచాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని E30 ప్రమాణాల ప్రకటన సూచిస్తుంది. భారతదేశంలో ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను మెరుగుపర్చడం, దేశీయ ఇథనాల్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడానికి E30 పెట్రోల్ ప్రమాణాలను ఖరారు చేయడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు.
భారత ప్రమాణాల బ్యూరో (BIS) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో E22 నుంచి E30 వరకు ఇంధన ప్రమాణాలను ఖరారు చేసింది. ఈ ఇంధనాలను ఉపయోగించే వాహనాల అనుకూలత, ఇంధన నిల్వ వ్యవస్థలు, పంపిణీ సదుపాయాలపై కూడా ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం.
ఇథనాల్ వినియోగం పెరగడం మూలంగా కార్బన్ ఉద్గారాలు తగ్గడంతోపాటు, దేశీయంగా చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే E20కు మించి వెళ్లాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, ప్రత్యేక నిల్వ సదుపాయాలు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.
అయితే, ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. E30 ప్రమాణాల ప్రకటన అంటే.. E30 ఇంధనం తక్షణమే విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని కాదు. కానీ, ఇది భవిష్యత్ విస్తరణ, వాహన అనుకూలత ప్రమాణాలకు పునాధి వేస్తుంది. ఇంధన వనరులను వైవిధ్యపరచడానికి, ప్రపంచ ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం చేస్తున్న దీర్ఘకాలిక ప్రయత్నంలో ఈ చర్య ఒక కొనసాగింపుగా నిలుస్తుంది.
