chhattisgarh inspector phone : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా ఉంది ఛత్తీస్గఢ్ లో ఓ అధికారి చేసిన నిర్వాకం. రిజర్వాయర్ లో పడిన తన విలువైన స్మార్ట్ ఫోన్ కోసం పొలాల సాగు కోసం నిల్వ చేసిన నీరంతా తోడేశాడు. మోటార్లు వేసిన మూడు రోజుల పాటు 21 లక్షల లీటర్ల నీటిని తోడి పారేశాడు. దీంతో రైతుల కోసం..పంట సాగునీటి కోసం నిల్వ చేసిన నీటిని తన ఫోన్ కోసం వృథా చేశాడు ఓ ప్రభుత్వ అధికారి. గత సోమవారం (మే22,2023) నుంచి గురువారం వరకు మూడు మోటార్లు వేసి డ్యామ్ లో నీరంతా తోడిపడేశాడు. రిజర్వాయర్ లో నీటిని తోడి తన ఫోన్ దక్కించుకోవటానికి నీటిపారుదల శాఖ అధికారుల సహాయ సహకారాలతో మరో ప్రభుత్వ అధికారి చేసిన నిర్వాకం కంకేర్ జిల్లాలో జరిగింది.
ఫుడ్ ఆఫీసర్ గా పనిచేసే రాజేశ్ విశ్వాస్ గత ఆదివారం కంకేర్ జిల్లాలోని కొలిబెడా బ్లాక్లో ఉన్న ఖేర్కట్టా డ్యామ్కు తన ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ కు వెళ్లాడు. ఫ్రెండ్స్ తో కలిసి తన Samsung S23 ఫోన్ తో సెల్ఫీ తీసుకుంటుండగా ఫోన్ కాస్తా జారీ రిజర్వాయర్ లో పడిపోయింది. ఆ ఫోన్ ఖరీదు రూ.96,000. దీంతో రాజేశ్ విశ్వాస్ ఆ ఫోన్ కోసం రిజర్వాయర్ లో ఈతగాళ్లతో వెతికించాడు. కానీ దొరకలేదు. తన ఫోన్ కోసం ఏకంగా డ్యామ్ లో నీరు తోడేయాలనుకున్నాడు.
దాంతో స్థానికంగా ఉండే నీటిపారుదల శాఖ అధికారుల వద్దకెళ్లి విషయం చెప్పాడు. నీరు తోడితే ఫోన్ దొరుకుతుందని దాంట్లో ప్రభుత్వ డేటా కూడా ఉంది చాలా అవసరం అది అంటూ వివరించాడు. దానికి వారు కూడా అంగీకరించాడు. ఇంకేముంది? మూడు మోటార్లు వేసి మూడు రోజుల పాటు నీరు తోడేశారు. 15అడుగుల లోతైన ఆ డ్యామ్ నుంచి 30 హార్స్పవర్ పంపులతో వరుసగా మూడు రోజుల పాటు నీటిని తొడించేశాడు. ఈ మూడు రోజుల్లో 21 లక్షల లీటర్ల నీరు వృధాగా అయ్యింది. కానీ తన ఫోన్ మాత్రం ముఖ్యం అనుకున్నాడు. వృథాగా పోని ఈనీటితో దాదాపు 1500 ఎకరాలు సాగు చేయవచ్చు.
అలా మిలియన్ల గ్యాలన్ల నీటిని విడుదల చేసిన మూడు రోజులకు ఎట్లకేలకు అతని ఫోన్ లభ్యమైంది. కానీ అది ఫోన్ మాత్రం పనిచేయని దుస్థితిలో ఉంది. కండీషన్లో లేదు. అప్పటికి డ్యాంలో నీటిమట్టం 10 అడుగుల మేర పడిపోయింది. నీళ్లలో పడిపోయిన ఫోన్ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజేశ్ను సస్పెండ్ చేశారు.
కానీ ఇక్కడ కూడా రాజేశ్ తను చేసిన పనిని సమర్ధించుకుంటూ డ్యామ్ నుంచి తోడేసిన నీరు సాగుకు పనికిరాదని మురుగునీరని చెప్పుకొచ్చారు. డ్యామ్ లో పడిపోయిన ఫోన్ లో ఇంపార్టెంట్ డేటా ఉందని..అందుకే ఇలా చేశానని..3-4 అడుగుల నీటిని ఖాళీ చేయడానికి కంకేర్ నీటిపారుదల శాఖ ఎస్డీవో ద్వారా అనుమతి తీసుకున్నానని అన్నారు. డీజిల్ పంపుతో నీరు తోడటానికి అయిన ఖర్చు రూ.7,000-8,000 వరకు ఉంటుందని..నేను చేసిన పని వల్ల ఏ రైతు కూడా నష్టపోలేదని చెప్పుకొచ్చారు.
దీనిపై జలవనరుల శాఖ డిప్యూటీ అధికారి రామ్లాల్ ధీవర్ మాట్లాడుతు..ఐదు అడుగుల లోతు వరకు నీటిని తోడేందుకు మౌఖిక అనుమతి ఉందని..కానీ 10 అడుగులకు పైగా నీటిమట్టం తగ్గిందని తెలిపారు. నీటిపారుదలపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు.కోల్పోయిన నీటికి పరిహారం అందించే చర్యలపై పరిశీలిస్తున్నారు.