Chhattisgarh 12 Board Exams కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణపై కొత్త ఆలోచన చేసింది. 12వ తరగతి బోర్డు పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. అంటే, విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను శనివారం సాయంత్రం చత్తీస్గఢ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CGBSE)విడుదల చేసింది.
పరీక్ష రాసేందుకు జూన్ 1-5లోపు ఏ రోజైనా విద్యార్థులు సంబంధిత కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాన్ని, బ్లాంక్ ఆన్సర్ షీట్స్ ను తీసుకుని వెళ్లవచ్చు. వాటిని తీసుకున్న తర్వాత ఐదు రోజులకు ఆన్సర్ షీట్స్ వారి వారి స్కూల్స్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ విద్యార్థి…. జూన్ 1వ తేదీన ప్రశ్నాపత్రాన్ని తీసుకుని వెళితే ఆన్సర్ షీట్స్ 6వ తేదీన సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థి.. ఐదో తేదీన పశ్నాపత్రాన్ని తీసుకెళితే 10వ తేదీన సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం మరియు సెలవు రోజుల్లో కూడా ఆన్సర్ షీట్స్ ను విద్యార్థులు సమర్పించవచ్చు. సమాధాన పత్రాన్ని పోస్టులో లేదా కొరియర్ ద్వారా పంపితే అనుమతించరు.
నిర్దేశించిన గడువులోగా ఎవరైనా ఆన్సర్ పేపర్స్ ను సమర్పంచికపోతే..వారిని గైర్హాజరు(absent)గా పరిగణిస్తామని సీజీబీఎస్ఈ సెక్రటరీ వీకే గోయల్ తెలిపారు. ఇతరుల సాయం తీసుకుకోకుండా విద్యార్థులు తమ సొంతగంగా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రశ్నాపత్రాన్ని తీసుకునే సమయంలో,ఆన్సర్ షీట్ ను సమర్పించే సమయంలో విద్యార్థులు మాస్క్ లు ధరించడం,భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని వీకే గోయల్ తెలిపారు. చత్తీస్గఢ్ బోర్డులో 12వ తరగతి పరీక్షల కోసం ఈ ఏడాది 2.86 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు.