ఎన్డీమే కూటమిలో భాగస్వామి,కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం జైళ్లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ సోదరుడిని బరిలో దించాలని నిర్ణయించింది. ఫాల్టాన్ అసెంబ్లీ నియోజకవర్గ సీటుని చోటా రాజన్ సోదరుడు దీపక్ నికల్జీకి కేటాయించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ), శివసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల పొత్తులో భాగంగా ఆర్పీఐకి బీజేపీ ఆరు సీట్లు కేటాయించింది. ఆర్పీఐకి కేటాయించిన సీట్లలో ఫాల్టాన్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది.
ఆర్పీఐ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంకాగా.. ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రత్యర్థి పార్టీలు బీజేపీపై విమర్శలు చేసే అవకాశం ఉందని పలువురు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.