CJI NV Ramana : త్వరలో మరో 50 హైకోర్టు జడ్జీ పోస్టుల భర్తీ
సుప్రీంకోర్టులో 9 మంది కొత్త న్యాయమూర్తులతోపాటు హైకోర్టులకు 10 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్టు CJI ఎన్వీ రమణ తెలిపారు. కోవిడ్, లాక్డౌన్ ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయాన్ని అందుబాటులో తెచ్చేందుకు కృషి చేసిందన్నారు.
- bheemraj
- Published On : April 30, 2022 / 12:41 PM IST
Cji Nv Ramana
CJI NV Ramana : హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జడ్జీల నియామకానికి అర్హుల పేర్లను సూచించాలని హైకోర్టులను సీజే ఆదేశించారు. సుప్రీంకోర్టులో నిన్న 39వ హైకోర్టు న్యాయమూర్తుల సదస్సును జస్టిస్ రమణ ప్రారంభించారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే హైకోర్టుల్లో 126 న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు.
త్వరలో మరో 50 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొంటున్నట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టులో 9 మంది కొత్త న్యాయమూర్తులతోపాటు హైకోర్టులకు 10 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్టు CJI ఎన్వీ రమణ తెలిపారు. కోవిడ్, లాక్డౌన్ ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయాన్ని అందుబాటులో తెచ్చేందుకు కృషి చేసిందన్నారు.
వినూత్నమైన ఫాస్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో విజయం సాధించామని సీజేఐ అన్నారు. కోవిడ్ కాలంలో న్యాయ సేవల అథారిటీ అణగారిన వర్గాలు నిరంతరం సేవలందించిందని ప్రశంసించారు. ఇక ఇవాళ విజ్ఞాన్ భవన్లో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జరుగనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు.
