Jawans Firing: జవాన్ల మధ్య గొడవ.. కాల్పులతో నలుగురు మృతి.. కారణం ఇదేనా..?
తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లా లింగంపల్లి బేస్ క్యాంప్ లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల మధ్య వాగ్వాదం జరిగింది. నలుగురు జవాన్లు చనిపోయారు.
- Ravikanth 10tv
- Published On : November 8, 2021 / 08:44 AM IST
Jawans
Jawans Firing: ప్రజల భద్రత కోసం పని చేయాల్సిన జవాన్లు.. వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారు. కోపంలో.. తమను తామే బలితీసుకున్నారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా పరిధిలో జరిగింది. దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన ఘర్షణే.. ఇందుకు కారణమైనట్టు తెలుస్తోంది.
అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లా లింగంపల్లి బేస్ క్యాంప్ లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల మధ్య వాగ్వాదం జరిగింది. బిహార్ కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బంగాల్ కు చెందిన రాజుముండల్, ధర్మేందర్ తో పాటు మరి కొందరు గొడవపడ్డారు. అది ముదిరి కాల్పుల వరకూ వెళ్లింది.
ఈ ఘర్షణలో.. రాజమణి, డంజి, రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే భద్రాచలం ప్రాంతీయ ఆస్పత్రికి వారిని తరలించగా.. చికిత్స తీసుకుంటూ ధర్మేందర్ చనిపోయాడు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఏడుగురు ఉన్నట్టు సమాచారం. విషమంగా ఉన్న ఇద్దరిని రాయపూర్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై.. బేస్ క్యాంప్ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గొడవకు దారి తీసిన పరిస్థితులు, అందుకు కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. మరోవైపు.. గాయపడిన జవాన్లను ప్రాణాలతో కాపాడేందుకు అవసరమైన చికిత్సను సైతం ఉన్నతాధికారులు అందిస్తున్నారు.
