×
Ad

బెంగాల్ దంగల్ : మమతా బెనర్జీ నామినేషన్

  • Published On : March 10, 2021 / 02:36 PM IST

bengal

CM Mamata Banerjee : బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నామినేషన్‌ దాఖలు చేశారు. నందిగ్రామ్‌ స్థానం నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు దీదీ. ఇప్పటి వరకు మమతా బెనర్జీ భవానీపూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీ పార్టీకి గట్టి కౌంటర్‌ ఇచ్చే లక్ష్యంతో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారికి గట్టి పట్టుంది. ఇటీవల ఆయన టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ పాలనపై ప్రజలు ఆగ్రహాంగా ఉన్నారని.. ఆమె పోటీ చేసేందుకు నియోజకవర్గం దొరకదంటూ బీజేపీ నేతలు విమర్శించారు. దీంతో భవానిపూర్‌ నుంచి కాకుండా నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి తన సత్తా ఏంటో చూపించాలని దీదీ డిసైడ్‌ అయ్యారు.

నామినేషన్‌కి ఒక రోజు ముందుగానే నందిగ్రామ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ చాయ్‌ వాలా ఇమేజ్‌కు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు మమత. రోడ్డుపక్కనున్న ఓ టీ స్టాల్‌లో ఛాయ్‌ తయారు చేశారు. అనంతరం దానిని వడపోసి, కప్పుల్లో పోసి అక్కడున్న అందరికీ వేడివేడిగా సర్వ్ చేశారు. ఆ తర్వాత సభలో ప్రసంగిస్తూ మీ బిడ్డగా ఇక్కడకు వచ్చానని… మీరు నామినేషన్‌ వేయద్దొంటే వేయనంటూ భావోద్వేగానికి లోనయ్యారు మమత. బెంగాల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ అగ్రనేతలందరూ పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు. మమతను దీదీ అంటూ బెంగాల్ ప్రజలు పిలుచుకుంటుండగా, అందుకు కౌంటర్‌గా బీజేపీ నేతలు మోదీ దాదా ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు.