Indian Army : ఆర్మీలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ హోదా

భారత సైన్యంలో ఐదుగురు మహిళలకు కల్నల్‌ హోదా దక్కింది. 26 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన మహిళా అధికారులకు కల్నల్‌ హోదాకు పదోన్నతి ఇస్తున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

  • Updated on- August 24, 2021 / 04:00 PM IST

Inidian Army

Colonel rank for five women officers in army : భారత సైన్యంలో ఐదుగురు మహిళలకు కల్నల్‌ హోదా దక్కింది. 26 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన మహిళా అధికారులకు కల్నల్‌ హోదాకు పదోన్నతి ఇస్తున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటలో పేర్కొంది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపింది. మెడికల్, లీగల్, ఎడ్యుకేషన్ రంగాలు కాకుండా ఇతర రంగాల్లోని మహిళా అధికారులకు ఇలా కల్నల్‌ హోదా దక్కడం ఇదే తొలిసారి కావటం గమనించాల్సిన విషయం.

మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఆర్మీలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఇలా పదోన్నతులు లభించే విభాగాలు పెరగడం వల్ల ఆర్మీలో మహిళలకు కెరీర్ అవకాశాల్లో వృద్ధి కనిపిస్తుందని ఆర్మీ పేర్కొంది. అలాగే లింగ సమానత్వం దిశగా ఆర్మీ తీసుకుంటున్న చర్యలకు ఈ నిర్ణయం అద్దం పడుతుందని తెలిపింది.

కొత్తగా కల్నల్‌ హోదా దక్కించుకున్న మహిళా అధికారులు.. కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఈఎమ్ఈ), కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌ విభాగాలకు చెందినవాళ్లు కావడం గమనార్హం. వీళ్లందరూ కూడా లెఫ్టినెంట్ కర్నల్‌ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి లెఫ్టినెంట్ కల్నల్ సంగీతా శార్దన (కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్), సోనియా ఆనంద్, నవనీత్ దుగ్గల్ (కార్ప్స్ ఆఫ్ ఈఎమ్ఈ), రీనూ ఖన్నా, రిచా సాగర్ (కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్).