Prashant Kishor: కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ సొంతంగా నిలదొక్కుకోగలదని అభిప్రాయపడ్డారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). తమ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ఇటీవల పీకే తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై పీకే ఒక మీడియా సంస్థతో మాట్లాడాడు. కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికల గురించి పార్టీ అధిష్టానంతో చర్చించానని, కొన్నింటిపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు పీకే. అయితే, ఆ ప్రణాళికల్ని కాంగ్రెస్ సొంతంగా అమలు చేసుకోగలదని అభిప్రాయపడ్డారు. ‘‘పార్టీ అధిష్టానానికి నేను చెప్పాల్సింది చెప్పాను. 2014 తర్వాత పార్టీ భవిష్యత్ గురించి అంత నిర్మాణాత్మకంగా చర్చంచడం ఇదే మొదటిసారి.
అయితే, కాంగ్రెస్ ప్రతిపాదించిన ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. వాళ్లు నన్ను ఆ గ్రూపులో చేరి, మార్పులు అమలు చేయాలి అని సూచించారు. నేను దాన్ని తిరస్కరించాను. ఇక రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీలలో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగించమని చెప్పాను. కానీ, ఎవరి పేరు సూచించానో చెప్పలేను. రాహుల్ స్థానాన్ని నిర్ణయించడానికి నేనెవరిని. 2002లో మోదీ స్థానం ఏంటి? ఇప్పుడేంటి? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలమైన పునాదులు ఉన్నాయి. ఆ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. కానీ, కొన్ని మార్పులు చేయాలి’’ అంటూ సూచించారు.