Rahul Gandhi: మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే.. భారత్ భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించింది ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్, చైనా సరిహద్దులో ఒక్క అంగుళం భూమికూడా మనం కోల్పోలేదని చెప్పారని, అదంతా అబద్ధమని ఇక్కడి ప్రజలు చెబుతుంటే తెలుస్తోందని రాహుల్ అన్నారు.
- Harishth Thanniru
- Updated on- August 20, 2023 / 02:58 PM IST
Rahul Gandhi
Congress Leader Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను అబద్ధాలతో మభ్య పెడుతున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లద్దాఖ్లోని లేహ్లో పర్యటిస్తున్న రాహుల్.. సరిహద్దు పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో మోటార్ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా పాంగాంగ్ సరస్సు ఒడ్డున రాజీవ్ గాంధీ చిత్రపటానికి రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడారు. ఇక్కడి ప్రజలకు కల్పించిన హోదాపై వీళ్లు సంతోషంగా లేరని అన్నారు. దీనిపై స్థానికులు నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్ర సమయంలోనే ఈ ప్రాంతంలో పర్యటించాలని అనుకున్నా. కానీ, అది సాధ్యపడలేదని రాహుల్ అన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్, చైనా సరిహద్దులో ఒక్క అంగుళం భూమికూడా మనం కోల్పోలేదని చెప్పారని రాహుల్ గుర్తుచేశారు. కానీ, ఇక్కడి ప్రజలు మాత్రం మన భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించిందని చెబుతున్నారని రాహుల్ అన్నారు. చైనా సైనికులు భారత్ భూభాగంలోకి ప్రవేశించడం వల్ల తాము మా పశువుల మేతకు వినియోగించిన ప్రదేశానికిసైతం వెళ్లలేక పోతున్నామని అంటున్నారని రాహుల్ అన్నారు.
