Rahul Gandhi
Rahul Gandhi Bharat Nyay Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రను చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట రాహుల్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు. యాత్రకు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి యాత్ర ప్రారంభమై మార్చి 20న ముగుస్తుందని చెప్పారు. భారత్ న్యాయ యాత్ర ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి ప్రారంభమై పశ్చిమాన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుందని తెలిపారు.
Also Read : Rahul Gandhi : డబ్ల్యూఎఫ్ఐ వివాదం వేళ.. బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ.. వీడియోలు వైరల్
ఈ యాత్ర మొత్తం 6,200 కిలో మీటర్లు కొనసాగనుందని కేసీ వేణుగోపాల్ చెప్పారు. అయితే, ఈ యాత్రను రాహుల్ గాంధీ కాలినడక, బస్సు ద్వారా కొనసాగిస్తారని, ఎక్కువ శాతం కాలినడక ఈ యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ యాత్రను భారత్ జోడో యాత్ర రెండో భాగంగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ చేపట్టే భారత్ న్యాయ యాత్ర 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో సాగనుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం భారత్ న్యాయ యాత్ర కొనసాగనుందని తెలిపారు.
యాత్ర సాగే రాష్ట్రాలు ఇవే..
మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర .
2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ప్రారంభమైంది. 2023 జనవరి 30న కాశ్మీర్ లో ముగిసింది. భారత్ జోడో యాత్ర ద్వారా 12 రాష్ట్రాల్లు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల్లో 4500 కిలో మీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. భారతదేశాన్ని ఏకం చేసి దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ యాత్ర కొనసాగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో యాత్ర సాగింది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ వెంట యాత్రలో పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకూడా ఓ కారణంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నుంచేకాక ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో మరోసారి దేశవ్యాప్తంగా యాత్రను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలని డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు కూడా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Congress General Secretary KC Venugopal says, "AICC has decided to hold a Bharat Nyay Yatra from January 14th to March 20th from Manipur to Mumbai…" https://t.co/1jz7JjCqIF pic.twitter.com/YAndjhdf7i
— ANI (@ANI) December 27, 2023