Facebook Influencing Polls భారతదేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరోపించింది. భారత ఎన్నికలను ఫేస్బుక్ ప్రభావితం చేస్తోందన్న అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది.
ఫేస్బుక్ తనను తాను ఫేక్బుక్గా దిగజార్చుకుందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. భారత్లో తమ ఫ్లాట్ఫామ్ వేదికగా చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనలను అడ్డుకోవటంలో ఫేస్బుక్ విఫలమైందన్న పలు అంతర్జాతీయ నివేదికలను ప్రస్తావిస్తూ ఖేరా ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికార బీజేపీకి ఫేస్బుక్ భాగస్వామ్య వ్యవస్థగా వ్యవహరిస్తూ ఆ పార్టీ అజెండాను ప్రచారం చేస్తోంది. లక్షల సంఖ్యలో పోస్టులతో కూడిన నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఫేస్బుక్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పటికీ వాటిపై సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫేస్బుక్ వ్యవస్థలోకి బీజేపీ కార్యకర్తలు చొరబడి దాని పనితీరునే మార్చేస్తున్నారన్నారు. నకిలీ పోస్టులు, కథనాల ద్వారా ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహించడానికి ఫేస్బుక్కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు.
ఢిల్లీ అల్లర్లు బంగాల్ ఎన్నికల సమయంలో ఫేస్బుక్ పనితీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. తమ అజెండాకు అనుగుణంగా నడుచుకుంటున్నందుకే.. ఎన్నికల్లో ఫేస్బుక్ జోక్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలపై ఫేస్బుక్ ఇండియా ఇప్పటివరకు స్పందించలేదు.
ALSO READ UP Election : యూపీలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన మాజీ సీఎం మనువళ్లు