Corona Second Wave: 10 శాతం మించితే కంటైన్మెంట్ జోనే.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా రోజుకు మూడున్నర లక్షలకు పైగానే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తుండగా మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్టాలు నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి
- Naresh Mannam
- Published On : April 30, 2021 / 11:23 AM IST
Corona Second Wave Centre Issues Fresh Guidelines For Covid Hit Districts
Corona Second Wave: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా రోజుకు మూడున్నర లక్షలకు పైగానే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తుండగా మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్టాలు నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి. అయితే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధించనున్నారా అనే చర్చ సాగుతుండగా కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా మరోసారి కంటైన్ మెంట్ జోన్ల పద్ధతిని పాటించాలని సూచించింది.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలలో కంటైన్ మెంట్ జోన్లుగా గుర్తించాలని తెలిపింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను కంటైన్మెంట్ జోన్ లుగా పరిగణించి కఠిన ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఏ జిల్లాలలో అయితే కొవిడ్ పాజిటివిటీ రేటు జనాభాలో 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నా, లేదా ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న ఆసుపత్రులలో పడకల సామర్థ్యం 60 శాతం దాటి కొత్త కేసుల నమోదవుతున్నా ఆయా జిల్లాలను కంటైన్మెంట్ జోన్ లుగా పరిగణించి.. కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించింది.
కంటైన్మెంట్ జోన్ విధానాన్ని అమలు చేయకపోతే వైరస్ వ్యాప్తిని అదుపు చేయగలమన్న కేంద్రం గతంలో మాదిరిగా ఆయా జోన్లలో కఠిన ఆంక్షలు అమలు చేయాలనీ సూచించింది. ఇదే సమయంలో ఆయా జిల్లాల్లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, అంబులెన్సుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించింది. కేసులు అధికంగా నమోదయ్యే ప్రాంతాలలో యధావిధిగా రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలని వెల్లడించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే హాజరు నిబంధనను విధించింది. మే 31 వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉండనున్నాయి.
