Corona Test: దేశంలో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఈ రెండు నెలల్లో ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లక్షల మధ్య కరోనా కేసులు నమోదయ్యేవి. ఇక మరణాలు కూడా అధికంగా సంభవించాయి. ఇదే సమయంలో పవిత్ర గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. అంతేకాదు గంగా నది ఒడ్డున ఇసుకలో పెద్ద ఎత్తున శవాలు బయటపడ్డాయి. గంగానదిలో శవాలు కొట్టుకురావడంతో నదిలో కరోనా అవశేషాలు ఉంటాయని అందరు అనుకున్నారు.
ఈ నీటిని వాడటం వలన కరోనా బారినపడే అవకాశం ఉందని చాలామంది భయపడ్డారు. ఇక ఈ నేథ్యంలోనే గంగానదిలో కరోనా అవశేషాలపై పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ముందుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల నుంచి నీటిని తెప్పించిన లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అధికారులు వీటిపై పరిశోధనలు ప్రారంభించారు.
అధ్యయనం నిర్వహించే సమయంలో నీటిలో వైరస్ల ఆర్ఎన్ఏ ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ్ బాటిక్ సోమవారం వెల్లడించారు. కాగా ఈ పరిశోధన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది.