అపార్ట్ మెంట్ లో 103 మందికి కరోనా

Covid Cases : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేపడుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. కనీస జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు ఇంకా నమోదవుతున్నాయి. తాజాగా..బెంగళూరు నగరంలో..ఓ అపార్ట్ మెంట్ లో 103 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. 465 ప్లాట్లు ఉన్న అపార్ట్ మెంట్ లో మొత్తం 1500 మంది వరకు నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో రెండు వివాహానికి సంబంధించిన పార్టీలు నిర్వహించిన కొద్ది రోజులకే కేసులు నమోదయ్యాయి.

ఇందులో ఉన్న వారికి కరోనా సోకిందనే వార్తలు రావడంతో అందరికీ టెస్టులు నిర్వహించారు. వెయ్యి మందికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. అందులో 103 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. మరో 500 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. ఒకే అపార్ట్ మెంట్ లో 100 మందికి పైగా కరోనా బారిన పడడంతో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వారందరినీ హోమ్ ఐసోలేషన్ చేశారు. మరోవైపు కరోనా నిబంధనలు పాటించాలని చెబుతున్నా..కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం లేదు. శానిటేషన్ విషయంలో కూడా అదే నిర్లక్ష్యం చేస్తున్నారు. వైరస్ పూర్తిగా కంట్రోల్ అయ్యేవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.