కేజ్రీవాల్కు బిగ్షాక్.. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఈనెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది
- Harishth Thanniru
- Published On : April 1, 2024 / 12:22 PM IST
Arvind Kejriwal
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. ఈనెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ ను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. తొలుత ఏడు రోజులు ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు.. అనంతరం మరో నాలుగు రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Also Read : Arvind Kejriwal : కోర్టులో కేజ్రీవాల్కి దక్కని ఊరట.. స్వయంగా వాదనలు వినిపించిన సీఎం
ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని, కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వలేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు.
Also Read : Arvind Kejriwal : జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేం.. స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
తీహార్ జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ ను కలిగి ఉండటానికి అనుమతి కోరుతూ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు అప్లికేషన్ దాఖలు చేశారు. ఇందులో భగవద్గీత, రామాయణం, హౌ ఫ్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను జ్యుడీషియల్ కస్టడీలో చదవడానికి కోర్టును కేజ్రీవాల్ అనుమతి కోరారు.
