Delhi Excise Policy Case : ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్కు తెలంగాణతో లింకు.. సీబీఐ ఎఫ్ఐఆర్లో హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారవేత్త పేరు
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కు తెలంగాణతో లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ. లిక్కర్ స్కామ్ లో ఏ1గా మనీశ్ సిసోడియాను పేర్కొన్న సీబీఐ ఏ14గా రామచంద్ర పిళ్లై పేరును చేర్చింది.
- Naveen
- Published On : August 19, 2022 / 11:08 PM IST
Delhi Excise Policy Case : ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కు తెలంగాణతో లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ. లిక్కర్ స్కామ్ లో ఏ1గా మనీశ్ సిసోడియాను పేర్కొన్న సీబీఐ ఏ14గా రామచంద్ర పిళ్లై పేరును చేర్చింది. ఇండో స్పిరిట్ పేరుతో రామచంద్ర వ్యాపారం చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా రామచంద్ర పిళ్లై లిక్కర్ వ్యాపారం జరుగుతోంది. టెండర్ దక్కించుకునేందుకు అరుణ్ పాండ్య ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించిన సీబీఐ రూ.2.50 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. హైదరాబాద్, బెంగళూరులోని రామచంద్ర పిళ్లై ఆఫీసుల్లో సోదాలు చేసిన సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ14గా రామచంద్ర పేరుని చేర్చింది.
ఢిల్లీలో మద్యం అమ్మకాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఓ వైపు సోదాలు కొనసాగుతుండగా… మద్యం అమ్మకాల్లో అవకతవకలపై పక్కా ఆధారాలు చేజిక్కించుకున్న సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా రాసేశారు. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఏ1గా పేర్కొన్నారు సీబీఐ అధికారులు.
ఈ కేసులో ఏ14గా బడా వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై పేరును చేర్చారు. హైదరాబాద్ వాసి అయిన పిళ్లై బెంగళూరు కేంద్రంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. పిళ్లైకి పలువురు రాజకీయ నేతలతోనూ సంబంధాలున్నట్లుగా సీబీఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం.
