Delhi Services Bill: రేపు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్సు.. లోక్సభలో రగడకు సిద్ధమవుతున్న విపక్షాలు
ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీ అని పేరు పెట్టడానికి ఒక అధికారం ఉంటుందని ఈ ఆర్డినెన్స్ పేర్కొంది
- tony bekkal
- Published On : July 30, 2023 / 09:00 PM IST
Parliament Monsoon Session: ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల బదిలీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లు సోమవారం (జూలై 31) లోక్సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తోంది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు అటు విపక్షాలు కూడా సిద్ధమైనట్లే కనిపిస్తోంది. దీంతో సోమవారం లోక్సభలో రగడ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీ అని పేరు పెట్టడానికి ఒక అధికారం ఉంటుందని ఈ ఆర్డినెన్స్ పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి కొద్ది రోజుల ముందు, ఢిల్లీలో బదిలీలు, నియామకాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు అప్పగించింది. ఈ బిల్లును వ్యతిరేకించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష నేతల నుంచి మద్దతు కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ దీనికి ఇప్పటికే మద్దతు ఇచ్చింది.
