దేశ రాజధాని ఢిల్లీలో ముక్కును కప్పి ఉంచే మాస్క్లకు గిరాకీ పెరిగిపోతుంది. కాలుష్యం అధిక స్థాయిలో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మెడికల్ షాప్లకు పరుగులు పెడుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కాల్చిన పటాసులతో మరింత అధికమైంది కాలుష్యం. అంతేగాకుండా పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం మూలంగా ఢిల్లీలో కాలుష్యం అధికమౌతోందని అధికారులు వెల్లడిస్తున్నారు.
గాలిలో ధూళి కణాలు అధికం కావడంతో మాస్క్లకు గిరాకీ ఏర్పడిందని మెడికల్ షాపు యజమానులు వెల్లడిస్తున్నారు. N95 ఫేస్ మాస్క్లకు అధికంగా డిమాండ్ ఉందంటున్నారు. దీపావళి పండుగ అనంతరం గాలి పీల్చడమే కష్టతరమౌతోందని, ఉబ్బసం రోగులు, గర్భణీ స్త్రీలు, పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ముఖానికి ముసుగు ధరించడం తప్పనిసరి అని, నాణ్యమైన..కంఫర్ట్ మాస్క్లను వేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది.
గాలి నాణ్యత ప్రమాదస్థాయికి పడిపోయిందని ఢిల్లీ పర్యావరణ వేత్తలు వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. నవంబర్ 04వ తేదీ నుంచి సరి – బేసీ విధానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చలికాలంలో పొగమంచుతో పాటు ఇతర వాహనాలు వెదజల్లే..కారకాలతో ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకోవడం చాలా కష్టంగా మారుతోంది.
Read More : కేరళకు రెడ్ వార్నింగ్ : ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ