Maharashtra Coalition Govt Differences : మహారాష్ట్ర కొత్త కూటమిలో అప్పుడే లుకలుకలు..బీజేపీ, షిండే వర్గాల్లో విభేదాలు
మహారాష్ట్రలోని కొత్త కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ, షిండే సంకీర్ణ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడవకముందే.. అభిప్రాయభేదాలు బయటపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ఇరువర్గాల మధ్య అసమ్మతిని రాజేయగా... ఇపుడు అది మరింత తీవ్రతరమైనట్లు తెలుస్తోంది.
- bheemraj
- Published On : August 23, 2022 / 10:46 AM IST
Maharashtra Coalition Government Differences
Maharashtra Coalition Government Differences : మహారాష్ట్రలోని కొత్త కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ, షిండే సంకీర్ణ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడవకముందే.. అభిప్రాయభేదాలు బయటపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ఇరువర్గాల మధ్య అసమ్మతిని రాజేయగా… ఇపుడు అది మరింత తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తదుపరి కాబోయే సీఎం ఫడ్నవిస్ అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన ప్రకటన ఆగ్రహానికి ఆజ్యం పోసింది.
అంతేకాదు 2024 ఎన్నికల్లో బుల్దానా లోక్సభ స్థానం నుంచి తమ అభ్యర్థిని బరిలో నిలబెడతామని బీజేపీ ప్రకటించింది. దీనిపై షిండే వర్గం రగిలిపోతోంది. ప్రస్తుతం బుల్దానా లోక్సభ స్థానం నుంచి ప్రతాప్ జాదవ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రతాప్ జాదవ్ ప్రస్తుతం షిండే వర్గంలోని కీలక నేత. ఆయన స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తామని ప్రకటించడం షిండేవర్గం నేతలల్లో ఆగ్రహానికి కారణమైంది.
పేరుకు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పటికీ… ఫడ్నవీసే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అసంతృప్తి షిండే వర్గంలో ఉంది. దీనికితోడు.. కూటమి భాగస్వామిని పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ చేస్తున్న తాజా ప్రకటనలతో.. షిండే-ఫడ్నవిస్ వర్గాల మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది భవిష్యత్లో చీలికకు దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది.
