Digital Currncy : డిజిటల్ కరెన్సీ బదిలీపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం రాజకీయ దుమారానికి దారితీసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. క్రిప్టో కరెన్సీని అసలు చట్టబద్ధం చేశారా? అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. దేశంలో వర్చువల్ డిజిటల్ కరెన్సీ లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, అందుకే పన్ను విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 30 శాతం చొప్పున పన్నుతో పాటు ఒక శాతం టీడీఎస్ విధించనున్నట్లు చెప్పారు.
వర్చువల్ ఆస్తులను గిఫ్ట్ రూపంలో అందించినా అదే ట్యాక్స్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. క్రిప్టో కరెన్సీ బిల్లు తేకుండా పన్ను ఎలా వేశారని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక మంత్రి దేశానికి సమాధానం చెప్పాలని సూర్జేవాలా డిమాండ్ చేశారు. రెగ్యులేషన్ పరిస్థితి ఏంటి? క్రిప్టో ఎక్స్ఛేంజీల నియంత్రణ మాటేంటి? ఇన్వెస్టర్ల రక్షణ సంగతి ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించినప్పటికీ.. దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని, ఇంతకుముందు కూడా దీనిపై ఎలాంటి చర్చా జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.
Read More : Hritik Roshan : యంగ్ హీరోయిన్ తో హృతిక్ డేటింగ్?? బాలీవుడ్ లో గుసగుసలు..
మరోవైపు.. కేంద్ర బడ్జెట్ను చూసిన నెటిజన్లు.. మిడిల్ క్లాస్ ఆశలపై నీళ్లు చల్లారనే అర్థంతో మీమ్స్ చేసి సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. #Budget2022, #IncomeTax హ్యాష్ ట్యాగులతో చేస్తున్న పోస్టులు ట్రెండింగ్ లో టాప్ స్పాట్ లో ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కేటగిరీలో ట్యాక్స్ స్లాబ్స్ లో ఎటువంటి మార్పులు ప్రకటించలేదు. దీంతో ఊహించనదానికి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో నిరాశవ్యక్తం చేస్తూ.. హిందీ సినిమా సీన్స్, జోక్స్ తో ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.