Bird Flu : దేశాన్ని మరో వైరస్ భయపెడుతుంది. అత్యంత ప్రమాదకరమైన బర్డ్ఫ్లూ వైరస్ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నది. కశ్మీర్ మొదలు కేరళ వరకు వందల సంఖ్యలో వలస పక్షులు ఈ వైరస్ బారిన పడి మరణిస్తుండటంతో కేంద్రప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు హెచ్చరికలు జారీచేసింది. హర్యానా, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ర్టాల్లో బర్డ్ఫ్లూ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. హర్యానాలో పంచకుల జిల్లాలోని కోళ్ల ఫారాల్లో గత 10 రోజుల్లోనే ఏకంగా 4 లక్షల కోళ్లు మృతి చెందాయి.
కేరళలో బర్డ్ఫ్లూతో 1700 బాతులు మరణించటంతో అలప్పుజ, కొట్టాయం ప్రాంతాల్లో పెంపుడు కోళ్లు, బాతులన్నింటినీ చంపేస్తున్నారు. ముఖ్యంగా వైరస్ వెలుగుచూసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న నెడుముడి, పల్లిప్పాడ్, కరువట్ట గ్రామాల్లో పక్షులన్నింటినీ చంపుతున్నారు. కేరళకు దగ్గరగా ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు బర్డ్ఫ్లూ భయంతో వణుకుతున్నాయి. కోళ్ల ఫారాలు, పక్షులు పెంపుడు కేంద్రాల్లోకి వైరస్ ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.. మధ్యప్రదేశ్తో సరిహద్దు ఉన్న మహారాష్ట్ర కూడా బర్డ్ఫ్లూపై అప్రమత్తమైంది.
బర్డ్ఫ్లూ నేపథ్యంలో కొంతకాలం కోళ్లు, బాతుల మాంసం తినొద్దని కేరళ, మధ్యప్రదేశ్ అధికారులు ప్రజలకు సూచించారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో కోళ్లు ఇతర పక్షుల మాంసం విక్రయాలను నిషేధించారు. పక్షుల్లోనే కనిపించే ఈ వైరస్ మనుషులకూ వ్యాపిస్తుందని మొదటిసారి 1997లో గుర్తించారు. వైరస్ సోకిన పక్షులకు సన్నిహితంగా ఉండేవారికి ఇది త్వరగా వ్యాపిస్తుంది. మనుషులకు ఈ వైరస్ సోకడం చాలా అరుదు అని గణాంకాలు చెబుతున్నాయి.. బర్డ్ఫ్లూపై తెలంగాణ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ సోకిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు..