Attack On Police : పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి..
తాగిన మైకంలో పోలీసులపై దాడి చేశారు మందుబాబులు. ఈ దాడిలో ఓ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మందుబాబుల దెబ్బలు తట్టుకోలేక ఘటనాస్థలి నుంచి పరుగులు తీశారు పోలీసులు.
- kunduru Vinod
- Updated on- June 27, 2021 / 03:43 PM IST
Attack On Police (2)
Attack On Police : మద్యం మత్తులో వీరంగం సృష్టించారు కొందరు యువకులు, పోలీసులపైనే కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం దిండుగల్ జిల్లా వత్తలగుండు చెక్పోస్టు వద్ద చోటుచేసుకుంది. ఒక బైక్ పై ముగ్గురు చొప్పున ఆరుగురు యువకులు చెక్పోస్టు దగ్గరకు వచ్చారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ధీరన్, హెడ్కానిస్టేబుల్ మేఘనాథన్, మరో కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నారు.
మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఊగిపోయి కర్రలు, కొబ్బరి మట్టలతో పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారి దెబ్బలు తట్టుకోలేక పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం ఆసుపత్రిలో చేరారు.
కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం సేలం జిల్లాలో మందుబాబు పోలీసులపై తిరగబడటంతో పోలీసులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో మందుబాబు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐని అరెస్ట్ చేశారు.
