Drinking water supply to be shut for 2 days in rain hit areas of Bengaluru
Bengaluru Drinking Water: కర్ణాటక రాష్ట్రాన్ని వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. ఇక ఇండియన్ సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు అయితే చిగురుటాకులా వణుకుతోంది. ఎటు చూసినా వరదే.. ఎక్కడ చూసినా వర్షపు నీరే. వర్షం కారణంగా నగర ప్రజలకు ఇప్పటికే ఎదుర్కొంటున్న కష్టాలకు తోడు కొత్త కష్టాలు వచ్చి మీద పడుతున్నాయి. నగరంలో రెండు రోజుల పాటు తాగు నీరు నిలిపివేస్తున్నట్లు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్బీ) తాజాగా ప్రకటించింది. పంపింగ్ స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో నగరానికి తాగు నీరు అందించలేకపోతున్నట్లు బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు పేర్కొన్నారు.
నగరంలోని మొత్తం 50 ప్రాంతాలు వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగు నీరు రావని బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు సోమవారం పేర్కొన్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సందర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల అనంతరం పంపింగ్ స్టేషన్ను ముంచేసిన నీటిని తోడే ప్రయత్నం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో మరో ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 9 వరకూ ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లడం మంచిది కాదని సూచించింది. కొడగు, ఉత్తర కన్నడ, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ను ప్రకటించారు. బెంగళూరు నగరం సహా కనీసం పది జిల్లాల్లో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.