Earthquake: నేపాల్, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత రాత్రి 2గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో నేపాల్లో మూడు సార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, మూడు ప్రాంతాల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.
Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు
నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (NEMRC) ప్రకారం.. నేపాల్లోని బగ్లుంగ్ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత రిక్టర్ స్కేల్ పై 4.7 ఒకసారి, 5.3 ఒకసారి, 4.0గా మరోసారి భూకంప తీవ్రత నమోదైంది. నేపాల్లోని బగ్లుంగ్ జిల్లా పరిధిలో అధికారిచౌర్ చుట్టూ అర్థరాత్రి తరువాత 1.23 గంటలకు భూమి కంపించగా, మరోసారి 3.28 గంటల సమయంలో భూమి కంపించింది. అదేవిధంగా బగ్లుంగ్ జిల్లాలోని ఖుంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి 2.07గంటలకు భూమి కంపించింది. మూడు సార్లు ఒకే జిల్లాలో భూమి కంపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు.
అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో అర్థరాత్రి దాటిన తరువాత 2.19గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని తెలుస్తోంది.