లోక్సభ ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
Arun Goel: కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం
- T Venkateshwarlu
- Updated on- March 9, 2024 / 10:00 PM IST
పదవీకాలం 2027 డిసెంబరు వరకు ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఎందుకు రాజీనామా చేస్తున్నానన్న కారణాలను అరుణ్ గోయల్ తెలపలేదు.
కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం గమనార్హం. ఇప్పటికే, గత నెల కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పటికే ముగ్గురు సభ్యుల ఈసీలో ఒక ఖాళీ ఏర్పడగా, ఇప్పుడు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే అందులో మిగిలారు. అనూప్ చంద్ర పాండే పదవీ విరమణతో కొత్త కమిషనరు ఎంపిక కోసం కమిటీ రెండు రోజుల క్రితం సమావేశం కావాల్సి ఉంది. పలు కారణాలవల్ల అది వాయిదా పడింది.
కాగా, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభకు కొన్ని వారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. జమ్మూకశ్మీర్లోనూ పర్యటన ముగిశాక శుక్రవారం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
