Lok sabha Elections 2024: ఎన్నికల వేళ బీజేపీ మూడంచెల వ్యూహం

గెలిచిన స్థానాల్లో మళ్లీ గెలవడం, కొత్త స్థానాలు గెలవడం, 2014 ఎన్నికల్లో గెలిచి... 2019లో కోల్పోయిన స్థానాలను తిరిగి గెలుచుకోవడం

Lok sabha Elections 2024: ఎన్నికల వేళ బీజేపీ మూడంచెల వ్యూహం

PM Modi

దేశంలో తమకు ఉన్న సానుకూనతలను ఓట్లుగా మలుచుకునేందుకు ఈ ఎన్నికల్లో బీజేపీ మూడంచెల వ్యూహాన్ని అవలంబిస్తోంది. గెలిచిన స్థానాల్లో మళ్లీ గెలవడం, కొత్త స్థానాలు గెలవడం, 2014 ఎన్నికల్లో గెలిచి… 2019లో కోల్పోయిన స్థానాలను తిరిగి గెలుచుకోవడం అనే వ్యూహం ద్వారా 370 టార్గెట్‌ను తేలిగ్గా చేరుకోవచ్చన్నది కమలం పార్టీ ఆలోచన. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లలో గెలుపొందింది.

మొత్తం 542 స్థానాలున్న లోక్‌సభలో సగానికి పైగా ఓ పార్టీ సొంతంగా గెలుచుకోవడం మూడు దశాబ్దాల తర్వాత అదే మొదటిసారి. 2019 ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ బలం మరింత పెరిగింది. గత ఎన్నికల్లో కమలం పార్టీ 303 స్థానాల్లో గెలుపొందింది. ఈ చరిత్రాత్మక విజయమే బీజేపీ కొత్త ఎత్తులకు చేరుకోవడానికి అవకాశం కల్పించింది.

సీట్ల లెక్కలు..
అయితే పోలిస్తే 2019లో ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ…2014లో గెలిచిన 282 స్థానాల్లో 35 సీట్లు కోల్పోయింది బీజేపీ. 56 కొత్త స్థానాల్లో గెలవడం ద్వారా ఎక్కువసీట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ..35 సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం పార్టీ పెద్దలను పునరాలోచనలో పడేసింది.

కాగా, 2014తో పోలిస్తే 2019లో ఉత్తరప్రదేశ్‌లో 14 చోట్ల, బీహార్‌లో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఇంకొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కస్థానం బీజేపీ కోల్పోయింది. ఈ 35 సీట్లలో మిత్రపక్షాలకు కేటాయించినవిపోగా మిగిలిన 26 స్థానాలను 2024 ఎన్నికల్లో గెలుచుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. వీటితో పాటు గత ఎన్నికల్లో గెలిచిన 303 స్థానాల్లోనూ కాషాయ జెండాను రెపరెపలాడించాలని కమలం పార్టీ భావిస్తోంది.

అలాగే గత ఎన్నికల్లో గెలిచిన 303, పోగొట్టుకున్న 26 స్థానాల్లో మళ్లీ గెలిచినా బీజేపీ టార్గెట్ 370 చేరుకోవడం సాధ్యం కాదు. దీని కోసం…కొత్త స్థానాల్లో గెలుపొందడమనే మూడో దశ వ్యూహం సిద్ధం చేసుకుంది. 2019లో 72 స్థానాల్లో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. ఈ స్థానాల్లో 15 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ 72 స్థానాల్లో 10శాతం ఓట్లను పెంచుకోవడం ద్వారా 370ని చేరుకోవడానికి అవసరమైన 41 స్థానాలను గెలుపొందగలమన్నది బీజేపీ ఉద్దేశం. అ

అలాగే 50శాతం సీట్లను కూడా పొందాలన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో గెలిచిన 303 స్థానాల్లో 224 సీట్లలో బీజేపీకి 50శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఆయా స్థానాల్లో ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కొత్తగా గెలవబోయే స్థానాల్లోనూ 50శాతం ఓట్లు పొందాలని భావిస్తోంది.

ఓడిపోయే స్థానాల్లోనూ వీలయినంత మేర ఓట్లు రాబట్టుకోవాలన్నది కూడా కాషాయదళం ఆలోచన. మొత్తంగా 50శాతం ఓట్లు, మూడొంతుల సీట్లు ఖాతాలో వేసుకుని తిరుగేలేని మెజార్టీతో దేశాన్ని పాలించాలన్న అతిపెద్ద లక్ష్యం దిశగా ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దల అడుగులు పడుతున్నాయి.

సానుకూలతలు ఇవే..
రామాలయం, ఆర్టికల్ 370 ఎత్తివేత, త్రిబుల్ తలాక్ రద్దు వంటి అసాధ్యాలెన్నింటినో ఈ ఐదేళ్ల కాలంలో సుసాధ్యాలు చేసింది బీజేపీ. ఆ పార్టీ చరిత్రలోనే ఈ ఐదేళ్ల కాలం స్వర్ణయుగం అని చెప్పొచ్చు. మాతృసంస్థ RSS, బీజేపీ సుదీర్ఘ లక్ష్యాలు నెరవేరిన కాలం ఇది. హిందుత్వకు అమిత ఆదరణ లభించిన సమయం.

ఇప్పుడు చేరుకున్నన్ని లక్ష్యాలు గతంలో ఎప్పుడూ బీజేపీ సాధించలేదు. ఆ అవకాశమూ లేదు. ఈ ఐదేళ్ల కాలంలో బీజేపీది సరికొత్త చరిత్ర. ఆ కొత్త చరిత్ర పునాదులు అత్యంత బలంగా ఉన్నాయన్న నమ్మకంతోనే ప్రధాని మోదీ 370 గురించి మాట్లాడుతున్నారు. మరింత బలంగా మారతామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నారు.

అమిత్ షా మొదలుకుని శివరాజ్ సింగ్ చౌహాన్ దాకా బీజేపీలో జాతీయస్థాయిలో ప్రభావం చూపగల నేతలు ఎందరో ఉన్నప్పటికీ…. ప్రస్తుతమైతే కమలం పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ మోదీనే. ఒక్కమాటలో చెప్పాలంటే బీజేపీ ముఖచిత్రం మోదీనే. అలాగే దేశం ముఖచిత్రంగా కూడా తానుండాలన్నది ప్రధాని లక్ష్యం.

ఆ క్రమంలోనే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, బలీయమైన దేశంగా తీర్చిదిద్దుతామన్న మాటను ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబతున్నారు. భారత్‌కు తృతీయ ప్రపంచ దేశమన్న హోదా తొలగిపోయి…అభివృద్ధి చెందిన దేశమన్న గుర్తింపు రావడానికి 2047ను డెడ్‌లైన్‌గా పెట్టారు ప్రధాని.

ఆ కల నెరవేరడానికి మార్గం ఇప్పుడు బీజేపీని గెలిపించడం ఒక్కటే అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రధాని విజయం సాధిస్తున్నారు. దేశ గతిని ఇప్పటికే చాలా మార్చామని..ఇకముందు సమూలంగా మార్చేస్తామని ప్రధాని ఆత్మవిశ్వాసంతో చెప్పడం వెనక ఈ పదేళ్ల కాలంలో మరీ ముఖ్యంగా బీజేపీ బంగారుకాలంగా భావించే ఈ ఐదేళ్లకాలంలో సాధించిన విజయాలే కారణం.

కోట్లాది ప్రజలున్న ఈ దేశంలో పదేళ్లక్రితం రామజన్మభూమిలో రామాలయం నిర్మితమవుతుందంటే నమ్మేవారి సంఖ్య వేలల్లో కూడా ఉండకపోవచ్చు. కానీ పదేళ్లు తిరిగే సరికి బీజేపీ పాలనలో అయోధ్య నుంచి బాలరాముడు చిరుదరహాసం చిందిస్తూ దేశప్రజలను ఆశీర్విదిస్తూ….సార్వత్రిక ఎన్నికల ప్రచారనికి కేంద్రబిందువయ్యేలా పరిస్థితులు మారిపోయాయి.

దక్షిణాదినా బీజేపీకి ఓట్ల వర్షం?
అంగరంగవైభవంగా, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలా జరిగిన రామమందిర ప్రారంభమహోత్సవం సాధారణ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తాయన్నది కాదనలేని సత్యం. సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన ఈ మహావేడుక ప్రభావం… రామజన్మభూమి ఉద్యమం మహోధృతంగా సాగిన ఉత్తరభారతదేశానికే పరిమితం కాదని.. దక్షిణ భారతంలోనూ బీజేపీకి ఓట్ల వర్షం కురిపించబోతోందని రాజకీయ నిపుణులు తేల్చిచెబుతున్నారు. అయోధ్య అధికారపీఠంపై మూడోసారి కూర్చోబెట్టబోతోందన్న ధీమాతోనే ప్రధాని దేశాభివృద్ధి, బలమైన ఆర్థిక వ్యవస్థ వంటి సుదీర్ఘ లక్ష్యాల గురించి మాట్లాడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయోధ్యలానే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు బాటలు వేసింది ఆర్టికల్ 370 ఎత్తివేత. RSS, BJP చిరకాలస్వప్నమయిన ఆర్టికల్ 370 ఎత్తివేత స్ఫూర్తిగానే ప్రధాని ఎన్నికల్లో కమలం పార్టీకి 370 సీట్లు కట్టబెట్టాలని దేశప్రజలకు పార్లమెంట్‌ వేదికగానూ, ఎన్నికల ర్యాలీల్లోనూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక త్రిబుల్ తలాక్ రద్దు, CAA, కామన్ సివిల్‌ కోడ్ అమలుకు ప్రయత్నాలు, బ్రిటిష్ చట్టాల స్థానంలో కొత్త నేరచట్టాలు, సెకండ్ వేవ్‌లో విధ్వంసం సృష్టించినప్పటికీ…కరోనా సవాళ్లను తట్టుకుని మరీ దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోకుండా అడ్డుకున్న వైనం, శాంతిభద్రతల పరిరక్షణ, పెనుభూతంలా వెంటాడే ఉగ్రవాదం ప్రభావం తగ్గిపోవడం వంటివి ..బీజేపీ పాలనపైనా, ప్రధాని పైనా దేశప్రజల్లో సానుకూల భావాన్ని పెంచాయి.

CM Jagan Election Campaign : ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం..! 16 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచార భేరి..!