National Herald Case : నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రెండు రోజుల్లో 20 గంటల పాటు రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఈడీ అధికారులకు రాహుల్ నుంచి సరైన సమాధానాలు లభించలేదు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో కొన్ని ప్రశ్నలు పూర్తి కానందున ఈ రోజు మరోసారి హాజరుకావాలని నిన్న ఈడీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు రాహుల్ ఇవ్వడం లేదని ఈడీ వర్గాల సమాచారం.
కాగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం. పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు అర్థరాత్రికే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏఐసీసీ చేరుకున్నవారిలో ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, యూత్ కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్, సేవాదళ్ కార్యకర్తలు ఉన్నారు.
మరోవైపు ఇటు తెలంగాణలోకూడా టీపీసీసీ నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు సన్నధ్దమయ్యింది. రాహుల్ గాంధీని మూడో రోజుకూడా ఈడీ విచారణకు పిలిచినందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉదయం 10 గంటలకు అందరూ గాంధీ భవన్ కి చేరుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపిలుపునిచ్చారు. దేశంలో ఉన్న సమస్యల దృష్టి మరల్చేందుకే సోనియా రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని విచారించినంతకాలం తమ నిరసన కొనసాగుతుందని ఆయన తెలిపారు.
Also Read : Kiran Bedi: సిక్కులపై కామెంట్ చేసినందుకు క్షమాపణ కోరుతున్న కిరణ్ బేడీ