మమ్మల్ని కాపాడండీ అంటూ కోర్టు కెళ్లిన ఓ ప్రేమ జంటకు ఆ న్యాయస్థానం రూ.10వేలు జరిమానా విధించింది. అదేంటీ..కాపాడమంటే జరిమానా వేయటమేంటీ..అందులోను ధర్మాసనం ఇటువంటి తీర్పు ఇవ్వటానికి కారణమేంటో చూడండీ..
వివరాల్లోకి వెళితే..పంజాబ్కు చెందిన ఓ ప్రేమజంట తమ కుటుంబాలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారి కుటుంబాలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు వారు ఎక్కడ తమను విడదీస్తారోననే భయంతో వాళ్లు.. మాకు రక్షణ కల్పించండీ అని కోరుతూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు.
దీనికి సంబందించి సదరు కొత్త దంపతులు తమ పిటిషన్తోపాటు సమర్పించిన పెళ్లి ఫొటోలను హైకోర్టు పరిశీలించింది. పెళ్లి సమయంలో వధూవరులతోపాటు, హాజరైనవారు కూడా కరోనా నిబంధనల ప్రకారం ముఖాలకు మాస్క్లు ధరించలేదని గుర్తించింది.
అసలే కరోనా కాలం..ముట్టుకోకపోయినా అంటుకుని వేధిస్తోంది. ఈ సమయంలో సదరు ప్రేమజంట పెళ్లి చేసుకుంది. వారికి జరిమానా వేయటానికి కారణం.పెళ్లి చేసుకునే సమయంలో వాళ్లు మాస్క్లు ధరించలేదు. దీంతో పెళ్లి చేసుకునే సమయంలో మాస్క్ లు ధరించకుండా ఉన్నందుకు ఆ నవదంపతులకు జస్టిస్ హరి పాల్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం రూ.10,000 విధిస్తూ తీర్పు చెప్పారు.
ఆ జరిమానా వసూలు చేయాలని..తరువాత నవ దంపతుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని గురుదాస్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హోషియార్పూర్ డిప్యూటీ కమిషనర్కు 15 రోజుల్లోగా రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ సొమ్మును షియార్పూర్ జిల్లాలో ప్రజలకు మాస్క్లను పంపిణీ చేయడానికి ఉపయోగించాలని ఆదేశించింది.