First Cabinet Meet After Reshuffle ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. కేబినెట్ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
కాగా, బుధవారం(జూన్-7,2021)సాయంత్రం కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. మొత్తం 43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. నిన్నటి వరకు సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవియా, హరిదీప్సింగ్ పురీ, రామచంద్ర ప్రసాద్ సింగ్.. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు,గడిచిన ఎన్నికలు,కేంద్ర మంత్రుల పనితీరు సామాజిక కూర్పు,మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు.