కరోనా నిబంధనలు పాటిస్తారా ? లాక్ డౌన్ ను ఎదుర్కొంటారా సీఎం వార్నింగ్
- madhu
- Published On : February 17, 2021 / 10:21 AM IST
Follow Covid Norms : కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తారా.. లేక మరో లాక్డౌన్ను ఎదుర్కొంటారా..? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని, అయితే ప్రజలెవరూ జాగ్రత్తలు తీసుకోవడం మానవద్దని సూచించారు. కరోనా నిబంధనలను ప్రజలు కఠినంగా పాటించాలని, లేదంటే మరోసారి లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందంటూ ఆయన స్పష్టం చేశారు.
లాక్డౌన్ కావాలా.. లేక కొన్ని ఆంక్షలతో స్వేచ్ఛగా జీవించాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. క్రమం తప్పకుండా మాస్కులు ధరించాలని.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆయన సూచించారు. లేదంటే మరోసారి లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందంటూ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ప్రస్తుతం భారీగా నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో సీఎం అక్కడి ప్రజలను హెచ్చరించారు. అజాగ్రత్త వహించవద్దని సూచించారు.
